తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Wednesday 2 July 2014

బాసులు ఏ వంకతోనైనా ఉద్యోగంలోంచి తీసేయవచ్చు

ఒక ఆఫీసులో..
ఒకసారి బాస్ ఒక ఉద్యోగిని పిలిచాడు. ఇదిగో అరుణ్.. కొన్ని కారణాల వలన మన సంస్థలోనుంచి కొందరిని ఉద్యోగం నుంచి తీసేయవలసిన పరిస్థితి వచ్చింది. అయితే, నువ్వు కాస్త తెలివైనవాడివి కాబట్టి నీకు ఒక పరీక్ష పెడతాను. అన్ని సమాధానాలు సరిగ్గా చెబితేనే నీ ఉద్యోగం ఉంటుంది లేదా ఉండదు.
ఉద్యోగి : సరే సార్.. అడగండి.
బాస్ : పైన ఒక విమానం పై 50 ఇటుకలున్నాయి. అందులోంచి ఒక ఇటుక కింద పడితే, అక్కడ ఎన్ని ఇటుకలుంటాయి?
ఉద్యోగి : చాలా సింపుల్.. 49 ఇటుకలు.
బాస్ : గుడ్. మూడు స్టెప్స్ లో ఒక ఏనుగుని ఫ్రిజ్ లో ఎలా పెడతావు?
ఉద్యోగి : ముందు ఫ్రిజ్ తలుపు తీసి, ఏనుగుని అందులో పెట్టి, తలుపు మూసేస్తాను.
బాస్ : హా.. మరి నాలుగు స్టెప్స్ లో ఒక జింకను ఫ్రిజ్ లో ఎలా పెడతావు?
ఉద్యోగి : ముందు ఫ్రిజ్ తలుపు తీస్తాను. అందులో ఉన్న ఏనుగుని బయటకు తీసి, జింకను పెట్టి, ఫ్రిజ్ తలుపు మూసేస్తాను.
బాస్ : నైస్.. ఒక సింహం పుట్టినరోజు జరుపుకుంటుంది. అక్కడికి అన్ని జంతువులూ వచ్చాయి, కానీ, ఒక్కటి మాత్రం రాలేదు. ఎందుకని?
ఉద్యోగి : ఎందుకంటే, జింకని మనం ఫ్రిజ్ లో పెట్టాం కదా!
బాస్ : ఓహో..! ఒక ముసలావిడ అడవిలో నుంచి నదిని దాటి వెళ్ళాలి. నదిలో అన్నీ మొసళ్ళు ఉన్నాయి. వంతెన లేదు. ఎలా దాటుతుంది?
ఉద్యోగి : చాలా ఈజీ.. మొసళ్ళన్నీ సింహం పుట్టినరోజుకని వెళ్ళాయి. ఆమె సులభంగా దాటి వెళుతుంది.
బాస్ : అబ్బో.. బాగుందయ్యా..! చివరి ప్రశ్న. అందులో మొసళ్ళు లేకపోయినా ఆ ముసలావిడ చనిపోయింది. ఎందుకు?
ఉద్యోగి : ఆ.. మ్మ్.. ఒకవేళ.. ఆ.. ఆ.. ముసలావిడకి ఈత రాక మునిగిపోయి ఉండవచ్చు (తడబడుతూ చెప్పాడు)
బాస్ : కాదు. పైన విమానం నుంచి పడిన ఇటుక ఆవిడ తలపై పడింది. అందుకే!
సో.. నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను.
నీతి : బాసులు ఏ వంకతోనైనా ఉద్యోగంలోంచి తీసేయవచ్చు

Friday 27 June 2014

పుష్కరాలను ఎలా నిర్ణయిస్తారు?? త్రివేణీ సంగమమంటే ఏమిటి?

పుష్కరాలను ఎలా నిర్ణయిస్తారు??
త్రివేణీ సంగమమంటే ఏమిటి?? ఎక్కడెక్కడ ఉన్నాయి??
ప్రకృతిని పూజించే సంస్కృతి మనది. అందులోను జీవనాధారమైన నీటికి నిలయమైన నదులను దేవతలుగా పూజిస్తాం. జనజీవితమంతా నదులతోనే ముడిపడి ఉంది. నదులు ప్రవహించే ప్రాంతాలే నగరాలైనాయి. నాగరికత పెంపొందించటానికి నదులే కారణం. 'హిందు' అనే పదం సింధు నుంచే వచ్చింది. చినుకులా రాలి, ఏరులై పారి, నదులుగా మారి, వరదలై పొంగి, కడలిచేరే దశలలో ఎన్ని మలుపులు! ఎన్ని సొగసులు! ఎన్ని కడగండ్లు! ఎన్ని పరిమాణాలు! కఠిన శిలల్లో ప్రయాణం, అవరోధాలను అధిగమించటం, కాలుష్యాలను భరించటం, పయనించినంత దూరం నేలతల్లిని సస్యశ్యామలంగా మార్చటం, పుణ్యక్షేత్రాలలో భగవంతునికి తనవంతు కైంకర్యం సమర్పించటం, క్షేత్రాన్ని తన తీర్థంతో పావనం చేయటం, ఉపనదులను కలుపుకోవటం, ప్రకృతి భీభత్సాలను భరించటం, నాగరికత తెచ్చే మార్పులన్నీ సహించటం చూస్తే నది మనకు ఒక మహోన్నత మార్గదర్శిగా కనిపిస్తుంది. నదీతీరాలన్నీ పుణ్యక్షేత్రాలకు నిలయాలే. నది మన సంస్కృతిలో ఎంత ప్రధానపాత్ర వహిస్తుందంటే మనం సంకల్పం చెప్పుకుంటూ, మన ఉనికి తెలుపుతూ (గంగా గోదావర్యోర్మధ్యప్రదేశ్) ఏఏ నదుల మధ్య ఉన్నామో చెప్పుకుంటాం.
వామనావతారంలో ఆకాశానికెత్తిన విష్ణుపాదాన్ని బ్రహ్మ తన కమండలంలోని నీళ్ళతో కడిగాడట. ఆ పవిత్ర జలమే విష్ణు పాదోద్భవ అయిన గంగానదిగా అవతరించింది.
పరమశివుడు తన జటాజూటంనుండి గంగను వదిలేటప్పుడు, ఆయన దాన్ని ఏడుపాయలుగా వదిలాడు. మూడు పాయలు (హ్లాదిని, పావని, నళిని) తూర్పు దిక్కుగా ప్రవహించాయి. మరో మూడు పాయలు (సుచక్షువు, సీతా, సింధు) పశ్చిమ దిక్కుగా వెళ్ళాయి. ఏడవపాయ భగీరధుడిని అనుసరించి వచ్చింది. భగీరధుడు ఒక దివ్యరధంలో ముందు ప్రయాణం చేస్తుండగా, గంగ ఆ రధం వెనకే ఉరవళ్ళు, పరవళ్ళతో ప్రవహిస్తూ వెళ్ళింది, ఈ ప్రయత్నానికి సమకట్టిన భగీరధుని పేరుమీదుగానే ఆ నదికి భాగీరథి అని పేరు వచ్చింది.
భాగీరధి, జాహ్నవి, అలకనంద ఉపనదులు కలసి హరిద్వార్ వద్ద గంగగా ప్రయాణం సాగించాయి. నదులన్నీ ఆ గంగాదేవికి ప్రతిరూపాలుగానే భావిస్తారు. గంగ, యమున, సరస్వతి నదుల సంగమాన్ని 'త్రివేణి సంగమం' అంటారు. ఆ పవిత్ర భూమి ప్రయాగ. యమున సూర్య తనయ. జన్మస్థానం యమునోత్రి.
నీలమేఘశ్యాముని యమునా తీర రాసలీలలకు ప్రత్యక్షసాక్షి. తాను నల్లగా వుండి ఆ నల్లనయ్యనకు ప్రీతిపాత్రురాలైంది.
ఇక సరస్వతి బ్రహ్మపత్ని. వాగ్దేవి, జ్ఞాన ప్రదాయిని. త్రివేణి సంగమ ప్రాంతంలో సరస్వతి అంతర్వాహిని, పన్నెండేళ్ళకొకసారి గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడో ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలొస్తాయి. ఉదాహరణకు గురుడు మేషరాశిలో ప్రవేశిస్తే గంగాక్, కర్కాటకరాశిలో ప్రవేశిస్తే యమునకు, మిథునరాశిలో ప్రవేశిస్తే సరస్వతికి సింహరాశిలోకి ప్రవేశిస్తే గోదావరికి, తులారాశిలోకి వస్తే కావేరికి, కన్యారాశిలోకి వస్తే కృష్ణా నదికి ఇత్యాదిగా పుష్కరాలు వస్తాయి. పుష్కరాల సమయంలో ఆయా నదులలో సమస్త దేవతలు ఉంటారనీ, పుష్కర స్నానం పాపాలను కడిగివేస్తుందని అంటారు.

Friday 30 May 2014

ఒక రోజు ఒక చిన్న పాప, తన తండ్రి

ఒక రోజు ఒక చిన్న పాప, తన తండ్రి వంతెన దాటుతున్నారు. తండ్రి, తన పాప ఎక్కడ పడిపోతుందో నని, పాపతో ఇలా అన్నారు,'చిన్న తల్లి, నా చెయ్యి పట్టుకో, అప్పుడు నువ్వు, నదిలో పడిపోకుండా ఉంటావు.'
అప్పుడు ఆ పాప ఇలా అంది,'లేదు నాన్నగారు, మీరే నా చెయ్యి పట్టుకోండి'.
'ఏమిటి తేడా' అని తండ్రి ఆశ్చర్యంగా అడిగేరు.
'చాలా తేడా ఉంది నాన్నగారు' అని పాప సమాధానం చెప్పింది.
'నేను మీ చెయ్యి పట్టుకుని, నాకు ఏమైన అయితే, నేను మీ చెయ్యి వొదిలెయచ్చు కదా. కాని మీరు నా చెయ్యి పట్టుకుంటే నాకు ఖచ్చితంగా తెలుసు, ఏది ఏమైన, మీరు నా చెయ్యి వొదలరు అని'.
నీతి :-
భగవంతుడు మనందరికి తండ్రి. భగవంతుడిని మనం వదులుకోవాలి అని అనుకున్నాఆయన మనల్ని వదలరు.
భగవంతుడిని గట్టిగా పట్టుకోవాలి, ప్రేమతో, భక్తి తో కట్టెయ్యాలి.

ఒక తండ్రి, ఒక కొడుకు.....

రోజూ కొడుకు చెయ్యి పట్టుకుని కబుర్లు చెబుతూ..
కొడుకేమో తండ్రి చెప్పే మాటలు వింటూ ఊ కొడుతూ..
బాబుని ఆ రోజు కూడా స్కూల్లో వదిలి వచ్చాడు తండ్రి రోజులానే...
ఉన్నట్టుండి మూడంతస్థుల స్కూల్ భవనం కూలిపోయింది,పిల్లల్లో ఈ కొడుకు,
ఇంకా కొంతమంది భవన శిధిలాల మధ్య ఏమీ కాలేదు కానీ,చుట్టూరా పడిపోయిన
గోడల మధ్యన చిక్కుకుపొయ్యారు,ఆ కొడుకు నాన్న,నాన్న అని అరుస్తూనే ఉన్నాడు..
కొంత సేపటివరకు ఎవరికీ ఏమీ అర్ధం కాలేదు పిల్లలకి..కాసేపటికి విషయాన్ని
అర్ధం చేసుకున్న పిల్లలు ఆ బాబు దగ్గరికి వచ్చి 'ఎందుకురా,అంతలా అరుస్తున్నావు,ఎవ్వరికీ ఏమీ వినిపించదు అని ఏడుపు గొంతులతో,దిగులు ముఖాలతో అడిగారు..అప్పుడు ఆ బాబు చెప్పాడు "మా నాన్న ఎప్పుడూ నాతో చెప్పేవారు,నీకు భయం వేసినా,బాధ కలిగినా..నాన్న అని తలుచుకో, లేదా నన్ను పిలు , నేను తప్పక నీ దగ్గరికి వస్తాను,ఆలస్యంగానైనా నిన్ను వెతుక్కుంటూ నేను ఎక్కడికైనా వస్తాను, అని చెప్పి , మళ్ళీ గట్టిగా నాన్నా,నాన్నా అని అరవటం మొదలు పెట్టాడు...ఇంతలో చుట్టూ ఉన్న పడిపోయిన గోడల శిధిలాల నుంచి ఏవో శబ్దాలు రాసాగాయి..పిల్లలకి భయం పెరిగి గట్టిగా ఏడ్చేస్తున్నారు,బాబు మాత్రం ఒకటే మాట "నాన్నా,నాన్నా..అంటూ ఒకటే పిలుపు....కొంతసేపయిన తర్వాత శిధిలాలు తొలగించి బయటినుంచి ఆ బాబు తండ్రి,కొంతమంది సహాయక సిబ్బంది చేతులు అందించి ఆ పిల్లల్ని,బాబుని బయటికి తీసారు....ఆ మిగిలిన పిల్లల తల్లితండ్రులు,ఆ తండ్రిని ఒకటే మాట అడిగారు,మీకెలా తెలుసు, మీ బాబు పిలుస్తాడని,కొన్ని శిధిలాలు తొలిగించేదాకా మాకెవ్వరికీ వినిపించని పిలుపు మీకెలా వినిపించింది, అప్పుడు తండ్రి చెప్పాడు "నా బాబుకి నా మాటల మీద నమ్మకం ఎక్కువ,వాడు ఏ కష్టం వచ్చినా నాన్న అంటూ నన్నే పిలిచి,నేను వాడి దగ్గరికి వెళ్ళే వరకు ధైర్యం కోల్పోడు,మా బాబుకున్న ఆ నమ్మకమే వాడిని ఏ సంఘటన అయినా పోరాడేలా చేస్తుంది,నేను వాడికి సహాయహస్తం అందించేవరకు, అని చెప్పాడు....ఆ తండ్రికి,కొడుక్కి మధ్య ఉన్న కనపడని,కూలిపోని గట్టి వారధి ఆ నమ్మకమే....ఆ నమ్మకమే ఆ బాబుతో పాటూ ఇంకో నలుగురు పిల్లలకు ధైర్యాన్ని,ప్రాణాన్ని పోసింది....నమ్మకమే జీవితం,నమ్మకమే అనుబంధం,నమ్మకం శాశ్వతం.......

Saturday 17 May 2014

మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి కాని బంధాన్ని కాదు"

"గోళ్ళు పెరిగినప్పుడు గోళ్ళను కత్తిరిస్తాం,


వెళ్ళను కాదు కదా!


అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు


కోపతాపాలను కత్తిరించాలి కాని 


బంధాన్ని కాదు"

Saturday 3 May 2014

కుంకుమను ధరించే సంప్రదాయం లో నిగూడంగా దాగి ఉన్న ఆరోగ్య పరమైన విషయాలు

పూర్వకాలంలో మగ, ఆడ తేడా లేకుండా నుదుటి పై కుంకుమను ధరించాలి అని పెద్దలు చెప్పేవారు . అది ఎందుకో నేను చదివిన కొన్ని విషయాలను మీకు తెలిచేస్తున్నాన్ను ప్రియ నేస్తాలు ..మీకు తెలిసిన విషయాలను కూడా మీ స్పందనల ద్వారా తెలియచేస్తే మరిన్ని విషయాలను తెలుసుకునే అవకాసం ఉంది కదా ? 

 "భూవో ఘ్రాణన్వయ సంది " అంటే నాశిక పై బాగం, భ్రుకుటి మధ్యబాగం కలుసుకునే చోట కుంకుమను ధరించాలి అని అర్ధం . ఇక్కడ ఇడ, పింగళ, సుషమ్నఅనే మూడు నాడులు కలుస్తాయి . దీనినే " త్రివేణీ సంగమం " అని కూడా అంటారు. ఇది వియూష గ్రంధికి అనుబంధ స్థానం . ఇదే జ్ఞానగంధి. ఎవరైతే సుషుమ్న నాడికి చురుకుదనం కలిగిస్తారో వారు మేధావులుగా భాసిల్లుతారనేది నిరూపించబడింది కదా ! మనం ధరించే బొట్టు ప్రభావం "పిట్యూటరీ గ్లాండ్" పై ఉంటుంది. "కేనన్" అనే ప్రఖ్యాత పాశ్చాత్య శాస్త్రవేత్త బృకుటి స్థానాన్ని మానవ ధన (+), మెడ వెనుక బాగాన్ని రుణ (-) విద్యుత్త్ కేంద్రాలు అని అన్నారు . ఇవి రెండు మన శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరణను చేస్తూ ఉంటాయి . బృకుటి వద్ద ఉన్న నాడులు చాలా సున్నితం గా ఉంటాయి . అందుకే తేప , జ్వరం వంటివి వచ్చినప్పుడు పెద్దలు , వైద్యులు కూడా చల్లని బట్టను వేయమని చెపుతారు. పైన పేర్కొన్న సున్నిత మైన, కీలకమైన నాడులను సూర్యకిరణాల తాకిడి, వేడిమి , వత్తిడి నుండి రక్షించుకోడానికి తప్పని సరిగా బొట్టును ధరించాలి. సాయంకాలం , రాత్రి సమయాలలో విభూతిని ధరించాలి. విభూధిని ధరించడం వలన చల్లగా ఉండి, రక్తప్రసరణ చక్కగా జరిగి మన శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తేజస్సు వృద్ది చెందడమే కాకుండా, చర్మ రోగాలను కూడా అంటకుండా కాపాడుతుంది. కుంకుమ శరీరంలో ఉన్న అధిక ఉష్ణోగ్రతను పీల్చుకుని, జథర, శ్వాశ, కేశములకు తగినంత ఉష్ణోగ్రతను అందిస్తూ ఉంటుంది. 

 మనం నేరుగా సూర్యుణ్ణి చూడలేము కదా? రంగుల కళ్ళద్దాలు ద్వారా కాని , ఏదైనా రంగుల గాజు ద్వారా కాని చూడడం సాధ్యం అవుతుంది . ఎందుకంటే సూర్యుని కిరణాలు అద్దం పై పడి తిరిగి పరావర్తనం చెందడం వలన కళ్ళకు ఏ విధమైన హానీ జరుగదు. అదే విధముగా బొట్టును ధరించడం వలన బృకుటి వద్ద ఉన్న జ్ఞాన నేత్రం పై సూర్యుని కిరణాలు తాకి పరావర్తనం చెందడం జరుగుతుంది. జ్ఞాన నాడికి ఏ విధమైన హనీ కలుగదు. పూర్వకాలం లో ప్రకృతి నుండి లభించే వస్తువులతో స్వయం గా కుంకుమను తయారు చేసుకుని ధరించి ఆరోగ్యం గా ఉండేవారు. కాని ఇప్పుడు కొన్ని రసాయనాల కలియికతో తయారౌతున్న స్టిక్కర్లను ధరించడం వలన ఆడవారు ఎన్నో చర్మవ్యాధులకు గురై అసలు బొట్టునే ధరించే వీలు లేకుండా పోతున్న సంఘటనలు కూడా ఉన్నాయి . 

 బొట్టు ధరించినవారు అందరూ మేధావులే అయితే మరి మన పూర్వీకులంతా మేధావులై ఉండాలనో, లేక మేధావులైన వారందరూ బొట్టునే ధరించారా అనో , మన హిందూసంప్రదాయం లోనే ఈ కుంకుమ ధరించే పద్దతి ఉంది , మిగిలిన ముస్లిం , క్రిస్టియన్ , సిక్కు వంటి మతాలలో లేదు కదా ? మరి వారిలో మేధావులు లేరా అంటే నేను చెప్పలేను కాని, బొట్టు ధరించడం వలన ఇటువంటి ఆరోగ్య పరమైన విషయాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కూడా నిరూపించడం జరిగింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడా కనిపించదు మనకు ఈ కుంకుమను ధరించే సంప్రదాయం. కాని మన హిందూ సంప్రదాయంలో పెద్దలు ఇంత నిగూడంగా దాగి ఉన్న ఆరోగ్య పరమైన విషయాలను ఏ పరిజ్ఞానంతో కనిపెట్టగాలిగారో ఏ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కాని ఆ రోజుల్లో అనే విష్యం మాత్రం ఇప్పటికీ అచ్చర్యానికి గురిచేస్తూనే ఉంటుంది కదా ?..హృదయ పూర్వక ధన్యవాదములతో..................

చీ చీ.... ఈ అబ్బాయికి అస్సలు సిగ్గు లేదు.

ఈ ఫోటోని చూస్తే మీకేమనిపిస్తోంది.....

Friday 2 May 2014

అమ్మా.. త్రాగినది అతడు, మరణిస్తున్నది నేను...

చనిపోతున్న వ్యక్తి యొక్క భావాలను ఎవరో ఇలా వ్రాసారు. అమ్మా,... నేనొక పార్టీకి వెళ్ళాను... నువ్వు చెప్పిన మాటను గుర్తుంచుకున్నాను. నన్ను త్రాగమని అందరూ ప్రోత్సహించినా నేను మద్యం పుచ్చుకోలేదు, సోడా త్రాగాను. నీ మాట విన్నందుకు మంచిగా అనిపించింది. నువ్వెప్పుడూ నామంచి కోరే చెప్తావు. నాకు తెలుసు. ఇతరులు “పరవాలేదులే, త్రాగినా డ్రైవ్చెయ్యొచ్చు” అని చెప్పినా, నువ్వు చెప్పినట్లే నేను మద్యం త్రాగి డ్రైవ్ చెయ్యలేదు, పార్టీ అయిపోవచ్చింది..త్రాగిన వారందరూ కార్లలో ఎక్కి డ్రైవ్చేస్తున్నారు, నేనూ నా బండి ఎక్కి రోడ్డు మీదికి వచ్చాను. ఆరెండో కారు నన్ను గమనించలేదు “ఢాం”అని నన్ను డీకొట్టింది, పేవ్మెంట్ మీద నేను పడి ఉన్నాను. పోలీసులు వచ్చారు. ఆ రెండో డ్రైవర్ త్రాగేసి ఉన్నాడన్నారు.. ఆంబులెన్స్ వచ్చింది. నేను కొద్దిసేపట్లో మరణిస్తాననివారన్నారు. అమ్మా.. త్రాగినది అతడు, మరణిస్తున్నది నేను...చుట్టూ రక్తం.. నా రక్తం, అమ్మా, నేను త్రాగలేదు, తక్కిన వాళ్ళు త్రాగారు, వాళ్ళకు సరైన ఆలోచన లేదు, నువ్వు నాకు చెప్పినట్లుగా వాళ్ళకు ఎవ్వరూ హితం చెప్పలేదా? చెప్పి ఉండి ఉంటే నాకీ భయంకర అకాల మరణం తప్పేదిగా.. నేను భరించలేని నొప్పి, బాధ, యమయాతన అనుభవిస్తున్నాను. నన్ను కొట్టినవాడు ఊరికే నిలబడి చూస్తూ ఉన్నాడు.. నేను చచ్చిపోతూ ఉంటే అతడు నడుస్తున్నాడు... అమ్మా ఇదేమి న్యాయం? నాకు సమాధానం చెప్పమ్మా... నాకు భయం వేస్తోంది... నా ఊపిరి ఆగిపోతున్నది....నా కోసం నువ్వు ఏడవకమ్మా...... ...... దీనిని మీకు తెలిసినవారందరికీ పంచండి. మనుష్యులలో ఇది మార్పు తేవాలి. త్రాగేసి డ్రైవ్ చెయ్యకూడదనే ఇంగితజ్ఞానం అందరికీ రావాలి

శుక్రవారం గుడికి వెళ్తున్నారా ? అయితే ఇది చదవండి.

శుక్రవారం పూట ఆలయాలను సందర్శించుకోవడం ద్వారా సుఖ సంతోషాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు లభించడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన శుక్రవారం పూట ఆలయాలకు వెళ్లే మహిళలు ఎలా వెళ్లాలంటే..? దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, కన్యలు సంప్రదాయ దుస్తులను ధరించాలి. చీరలు, లంగా ఓణీలు వంటి ధరించాలి. జీన్స్ టీ షర్టులు వంటి ఆధునిక వస్త్రాలు ధరించరాదు.పురుషులైతే పంచ కండువా లేదా కుర్తా పైజామా వంటి సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. నుదుట కుంకుమ రంగుతో కూడిన బొట్టు పెట్టుకోవాలి. ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద పెట్టడం, విభూతిని నుదుట బొట్టుకు పైన పెట్టడం చేయాలి. విగ్రహాలకు కర్పూరం వెలిగించేటప్పుడు ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో లేదా ఇతరుల వద్ద అగ్గిపెట్టెలను అప్పు తీసుకుని దీపమెలిగించడం కూడదు. ఇక శుక్రవారం ఉదాహరణకు విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తున్నారంటే.. గరిక మాలతో తీసుకెళ్లండి. గరికమాలను వినాయకునికి ప్రతిశుక్రవారం సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, సర్వ శుభాలు చేకూరుతాయి. ఇదేవిధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకునే భక్తులు తులసీ మాలతో వెళ్లండి. అలాగే ఆంజనేయస్వామిని దర్శించుకునే వారు వెన్నముద్దతో వెళ్లడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా దుర్గమ్మతల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శుభమస్తు.