తెలుగు వారికి స్వాగతం.. సుస్వాగతం........వందనం... అభివందనం....

Saturday 6 August 2011

కళ్యాణి రాగం :: నా మనసు వినిపించే మౌనరాగం....



నా మనసు
వినిపించే
మౌనరాగం....
నీ హృదయాన్ని
స్పర్శించిందనడానికి...
నీ కళ్ళు పలికే 
పల్లవులే గుర్తు.









Thursday 4 August 2011

కసబ్ రంజాన్ ఉపవాసం ఉండడం లేదు...... ఇది ఒక వార్తా? (చర్చించండి)



కసబ్ రంజాన్ ఉపవాసం ఉండడం లేదు...... 

అసలు ఈ వార్త పత్రికలో ప్రచురణార్హమా? ఒక తీవ్రవాది... అది కూడా ఎంతోమందిని పొట్టనపెట్టుకున్న ఒక మానవరూప రాక్షసుడి గురించి.....రాయడం ఎంతవరకు సబబు.
నిద్రపోతున్న జాతిని మేల్కొలిపేది పత్రిక.  కాని ఈరోజు ఏ పత్రిక చూసినా ఎవరో ఒకరికి చెంచాగిరి చేస్తూనే ఉన్నాయి. నిష్పాక్షికంగా మేము వార్తలను ప్రచురిస్తాము అని ప్రతి పేపర్ చెప్తూనే ఎవరోఒకరి పక్కనే అన్ని వార్తలు రాస్తున్నాయి. 

ఈ భావదారిద్ర్యం ఇంకా ఎన్నాళ్ళు. క్రైమ్‍స్టోరీస్ లేదా సెక్స్ స్కాండల్స్ గురించి రాస్తే పేపర్ సర్క్యులేషన్ పెరుగుతుందని వాటి బాటనే ఎక్కువ పత్రికలు రాస్తున్నాయి. ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్యాల్సిన అవసరం పత్రికల మీదా మీడియా మీద ఉంది. 

అదే కసబ్ గురించి, అతన్ని ఇంకా ఎందుకు ఉరి తీయడం లేదు అని ప్రతిరోజు రాయండి. దేశప్రజల మనోభావాల్ని కేంద్రప్రభుత్వానికి తెలిసేలా పత్రికా ప్రపంచం ప్రయత్నించాలి. అంతేగాని, అత్యాచారానికి గురైన వాళ్ళ ఫోటోలు, అడ్రస్ లతో సహా వివరంగా రాసి వారిని మరింత బాధపెట్టడం కాదు.

మనదేశ పార్లమెంటు మీద దాడి చేసిన ఒక తీవ్రవాదిని, మనదేశప్రజల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపిన నరరూపరాక్షసుడిని సకలభద్రతల మధ్య, రోజూ బిర్యానీలు పెట్టి మరీ పోషించి పెంచుతున్నా మనప్రభుత్వ దౌర్భాగ్యాన్ని ఏమనాలి. 

చట్టాల్ని సవరించాలి. తీవ్రకాలయాపన చేయకుండా దేశభద్రతకు ద్రోహం తలపెట్టే వారిని ప్రాసిక్యూట్ చేసి వారికి కఠినశిక్షలు విధించాలి.  అఫ్జల్‍గురు, కసబ్ లాంటి వారికి ఇన్ని రోజులు రాచమర్యాదలు చేయడం మనతప్పే. వారికి ఈ భూమి మీద జీవించే అవకాశమే లేదు. 

ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని తీర్చడానికి, ప్రభుత్వంలో, ప్రజల్లో చైతన్యం వచ్చేలా పత్రికలు కృషి చేయాలి.

Wednesday 3 August 2011

చల్లని నీ కళ్ళలో కలలా నిలిచిఉన్నాను....


చల్లని నీ కళ్ళలో
కలలా నిలిచిఉన్నాను....
కన్నీటితో
నన్ను కరిగించివేయకు....

కనీసం అలా అయినా
నేను నీలో ఉన్నానని
నా మనసు సేద తీరుతుంది...

ఈ గుండె కొట్టుకుంటోందంటే...
దానికి కారణం నా యెదలోతుల్లో...
నువ్వు చేసే సవ్వడి.....
ఆ.. సవ్వడే నా గుండె చప్పుడై
నన్ను బ్రతికిస్తోంది.....


Tuesday 26 July 2011

నీలి మేఘం..:: పురిట్లో మగబిడ్డ... కడుపులో తిరగబడ్డాడు....



పురిట్లో మగబిడ్డ...
కడుపులో తిరగబడ్డాడు.


పెద్దాపరేషన్....
కోలుకోవడానికి చాలాకాలం పట్టింది.


ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత...


మళ్ళీ తిరగబడ్డాడు...
ప్రేమించానని చెప్పి అమ్మను వదిలివెళ్ళిపోయాడు...


పాపం పిచ్చి అమ్మ.....
ఇంకేం కోలుకుంటుంది......

Saturday 23 July 2011

భారతమాత బిడ్డలారా... ఒక్కక్షణం.... అందరూ దీన్ని చూడండి....




దీనిపై మీ భావాలను తెల్పండి.....

బోలో భారత్ మాతాకి జై........ బోలో భారత్ మాతాకి జై.......

Thursday 21 July 2011

అగ్రిగోల్డ్ హాయ్‍లాండ్..ఎంజాయ్....హాయ్‍లాండ్







మిత్రులకు శుభోదయం.

 హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్యనే నేను, నా శ్రీమతి ఇద్దరం అగ్రిగోల్డ్ హాయ్‍లాండ్ కి వెళ్ళి వచ్చాం. చాలా అద్భుతంగా ఉంది. విజయవాడలో అమ్మవారి దర్శనం చేసుకొని మరుసటి రోజు విజయవాడ నుండి హాయ్‍లాండ్ కి వెళ్లాము. ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే చాలా ఎంజాయ్ చేసాము. వాటర్‍రైడ్స్ అన్నింటికన్నా చాలా బాగా నచ్చాయి. స్లైడ్ టవర్, వేవ్‍పూల్, లేజీపార్క్, రెయిన్‍డాన్స్... వాటర్ కి సంబధించిన గేమ్స్. చాలా సూపర్ గా ఉన్నాయి.

మధ్యాహ్నం వరకు వాటిలో ఎంజాయ్ చేసి, అక్కడే ఫుడ్‍కోర్ట్ లో భోజనం చేసి, మిగతా రైడ్స్ కి వెళ్ళాము.
దాదాపు అన్నీ రైడ్స్ చేశాము. వాటిలో ఎక్కువగా నచ్చింది.... బంపింగ్ కార్స్, ఘోస్ట్ హంటర్, గో కార్టింగ్, రైల్ ఛేజ్ రైడ్... ఇవి చాలా బాగా ఎంజాయ్ చేశాము.

తరువాత షాపింగ్ చేశాము.  ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. తరువాత అగ్రిగోల్డ్ వారు ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్ చాలా బాగుంది. మూజికల్ నైట్ లాగా మూజికల్ సాయంత్రం అన్నమాట. వాళ్ళు పాడిన పాటలు, డాన్సులు చాలా బాగున్నాయి.  మాజిక్ షో చాలా బాగుంది.
అది అయ్యాక తిరిగి వచ్చేశాము.

మీరుకూడా వెళ్ళండి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.

లోపలికి ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్ తీసుకుపోనివ్వరు. కనీసం బిస్కట్ పాకెట్ కూడా తీసుకెళ్లనివ్వరు.
ఒక బాగ్ వరకు లగేజ్ అక్కడ లగేజ్ రూమ్ లో పెట్టవచ్చు.
ప్రారంభ టికెట్ తీసుకోండి. లోపల నచ్చిన ఐటెమ్స్ వద్ద సెపరేట్ గా టిక్కెట్ తీసుకోవచ్చు.
ఇంటి దగ్గరనుండే మగవారు షార్ట్స్, లేడీస్ ఐతే కంఫర్ట్ గా ఉండే డ్రస్ తెచ్చుకోండి.(అక్కడ వాళ్ళు రెంట్ కి డ్రస్ లు ఇస్తారు).
వాటర్ లోకి ఎంటర్ అయ్యేముందు మీ లగేజ్ ని అక్కడే రెంట్ కి ఇచ్చే లాకర్లలో భద్ర పరుచుకోండి.
వాటర్ రైడ్స్ అయ్యాక స్నానం చేసి డ్రస్ ఛేంజ్ చేసుకోండి.
పిల్లలను వాటర్ లోకి తీసుకెళ్ళినపుడు జాగ్రత్తగా చూసుకోండి.
విజయవాడనుండి 47H బస్ ఎక్కితే డైరెక్ట్ గా హాయ్‍లాండ్ కి వెళ్తారు.
సో.... ఎంజాయ్....హాయ్‍లాండ్...

Tuesday 12 July 2011

నాకు నచ్చిన టాప్ 10 మెలోడీస్....

నాకు నచ్చిన టాప్ 10 మెలోడీస్....

ఆకులో ఆకునై....
కరిగిపోయాను కర్పూరవీణలా...
మంచుకురిసే వేళలో....
మల్లి మల్లి ఇది రానిరోజు....
వేణువై వచ్చాను ....
తొలిసంధ్య వేళలో.....
చుక్కల్లే తోచావే....
భద్రగిరి రామయ్య...పాదాలు కడగంగ....
ఎన్నో రాత్రులొస్తాయి కానీ రాదీ వెన్నెలమ్మా...
వయ్యారి గోదారమ్మా...ఒళ్ళంతా ఎందుకమ్మా...కలవరం

తెలుగులో టాప్ 10 మెలోడీస్....ఏవి?

హాయ్.... మిత్రులారా......శుభోదయం.
ఎలా ఉన్నారు. అందరూ చాలా చాలా బాగా ఉంటారని మనస్పూర్తిగా నమ్ముతున్నాను. ఏం లేదండి ఈ మధ్య ఎగ్జామ్స్ ఉండి ఒక నెలరోజులు బ్లాగ్ లో లేనండి.


సరేగాని.... నాకో విషయం తెలుసుకోవాలనుందండి.....


మన తెలుగు సినిమా పాటల్లో మంచి మెలోడీ సాంగ్స్ టాప్ 10 ఏవో తెలుసుకోవాలని.  


మీకు నచ్చిన, మీరు మెచ్చిన ఒక పది  మెలోడీ సాంగ్స్ ని చెప్పండి. అందరి ఇష్టాఇష్టాలు తెలుసుకున్న తరువాత మనం ఏ సాంగ్స్ ని ఎక్కువమంది మెచ్చారో వాటిని టాప్ 10 గా నిర్ణయిద్దాం.


మరెందుకండీ ఆలస్యం..... మీకు నచ్చిన పది మెలోడీ సాంగ్స్ ని రాసేయండి.

Tuesday 17 May 2011

గుడి - part 2




                                                                                                                        contd.....
                                                                                        

Thursday 12 May 2011

నీకు నేనేం ద్రోహం చేశాను నాన్నా? నన్నెందుకు చంపావు?

(కర్నూల్ లో నిన్న జరిగిన దారుణానికి (ఆడపిల్ల కడుపులో ఉందని స్కానింగ్ లో తెలుసుకుని భార్యను, కడుపులోని బిడ్డను కిరాతకంగా చంపేసిన ఉదంతం), బలై పోయిన ఆ పసిబిడ్డ మనోగతం ఇలాగే ఉంటుందేమో)


నీకు నేనేం ద్రోహం చేశాను నాన్నా? నన్నెందుకు చంపావు?


మీ అందరితో సంతోషం
పంచుకోవాలనుకున్నాను.
నిన్ను, అమ్మను ఎప్పుడెప్పుడు 
చూస్తానా అని అమ్మ పొట్టలో
కలలు కంటూ గడిపాను.
ఆ అమ్మ పొట్టలోనే 
నన్నెందుకు చంపేశావు నాన్నా?

ఆడపిల్ల గా పుట్టబోవడమేనా...
నేను నీకు చేసిన ద్రోహమా?
అలా అయితే నిన్ను కన్నది కూడా 
ఓ ఆడదే కదా నాన్నా?
మీ అక్క, మీ చెల్లి కూడా 
ఆడవాళ్ళే కదా... మరి వారినెందుకు చంపలేదు.
ఓ... నిన్ను కని, పెంచి పోషించింది ఒకరు, 
నీ తోబుట్టువులు మరొకరనా....

మరి నేను కూడా నీ రక్తం 
పంచుకున్నాగా నాన్నా.....
నన్నెందుకు చంపావు?

అయినా మా ఆడవాళ్ళు నీకేం ద్రోహం
చేశారని నామీద, అమ్మ మీద
కసి పెంచుకుని మమ్మల్ని చంపేశావు.

తనవాళ్ళందరని వదిలి,
నీకు, నీ కుటుంబానికి ఊడిగం చేసి,
నీ అవసరాలు తీర్చి, నీకు సుఖాన్నిచ్చిన
పాపానికా.... అమ్మను చంపావు?

అమ్మ ఒడిలో కమ్మగా నిద్ర
పోవాల్సిన నన్ను, నీ కసాయితనం తో
శాశ్వతంగా నిద్రపుచ్చావు.

అమ్మ పాలు తాగుతూ, లాలి పాటలు వింటూ,
కేరింతలు కొడుతూ ఆడుకోవాల్సిన నన్ను 
మొగ్గలోనే చిదిమేసి విలవిలలాడుతూ
చావుబతుకుల మధ్య కొట్టుకుంటూ
చచ్చేలా చేశావు....

నీ గుండెలపై పడుకుని,
నీ వేళ్ళు పట్టుకుని నడక నేర్చుకోవాలని
చాలా ఆశ పడ్డాను నాన్నా....కానీ
నాకు జీవితమే లేకుండా చేసేశావు నువ్వు.
నువ్వసలు నాన్నవే కాదు.

కష్టంలో, సుఖంలో ఎల్లవేళలా
కంటికి రెప్పలా చూసుకుంటానని
ప్రమాణం చేసి మరీ అమ్మను చంపేశావు.
నువ్వసలు భర్తవే కాదు.

కాదు కాదు... నువ్వసలు మనిషివే కాదు
ఒక కసాయి వాడివి...
మనిషి రూపంలో ఉన్న ఒక రాక్షసుడివి....
రక్తం పీల్చే పిశాచివి......


(బిడ్డ కడుపులో ఉండగానే ఆడపిల్ల అని తెలిస్తే చాలు చంపడం మనిషి చేసే పని కాదు. ఆడపిల్ల అయినా, మగ పిల్లాడు అయినా ఎవరైనా ఒకటే. ఒక ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు. భ్రూణహత్యలను నిరసనతెల్పండి. పసిపిల్లలను కాపాడడంలో చేయి చేయి కలపండి.)


Wednesday 11 May 2011

చైత్రమాస వెన్నెల వేళ మల్లె పువ్వుల సోయగం......

మల్లెపువ్వు....         King of All Flowers.............


మంచుకురిసే వేళలో...మల్లె విరిసేనెందుకో......


చైత్రమాస వెన్నెల్లో చిరుగాలికి మనసారా నవ్వుతూ తలలూపే విరబూసిన మల్లెపూలను చూస్తే మనసు పులకరించిపోతుంది.
మైమరపించే సువాసన మనల్ని ఎక్కడో విహరించేలా చేస్తుంది.


మగువల మనసు దోచే అపురూప పుష్పం. మల్లెపువ్వును ఇష్టపడని అతివ ఉండదు అంటే అదేం అతిశయోక్తి కాదు.
తెలుపుకే అసూయపుట్టించే శ్వేతవర్ణ పుష్పం మల్లెపువ్వు.
మల్లెపూలు పసిపాపల్లా నవ్వేపువ్వులు. అతి సున్నితమైనవి.
గుండుమల్లె, సెంటుమల్లె, కాగడామల్లె, దొంతరమల్లె, చమేలి, విరజాజి, సన్నజాజి....... ఇలా ఎన్నో పేర్లతో మల్లెపూలను పిలుస్తారు.
మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పువ్వు మల్లెపువ్వు.
థయ్‍లాండ్ లో అమ్మకు ప్రతిరూపం గా మల్లెపువ్వును భావిస్తారు.
పాకిస్తాన్, టునీషియా, ఫిలిప్పైన్స్ దేశాల జాతీయపుష్పం మల్లె.
మనసు దోచేయడంలో మల్లెపువ్వు కు సాటిరాగలపువ్వు మరొకటి లేదు.
మల్లెచెట్టు వేరు బీరువాలో ఉంచితే సంపద పెరుగుతుందని ఉత్తరాది వారి నమ్మకం.
భర్త మల్లెపూలు తెస్తే ఆ భార్య మురిసిపోతుంది. జడలో తురుముకుని తన అందం ఇనుమడింపచేసుకుంటుంది.
మల్లెపూలను పసిపాపల్లా పెంచుతారు. చక్కగా పందిరి అల్లిస్తారు.  దీనికి నీరుతడి ముఖ్యం. ఇసుకనేలల్లో మల్లెతోటలు ఎక్కువ.


ప్రతిపెళ్ళిలోను మల్లెలు సందడి చేస్తాయి. అందరిని మురిపిస్తాయి.
అంతేకాదండోయ్...... మల్లెల వల్ల అనేక లాభాలున్నాయి.
మల్లెపూలను అరోమా థెరఫీ లో, ఆయుర్వేదం లో విరివి గా ఉపయోగిస్తారు.
మల్లెలు నరాలపై మంచి ప్రభావం చూపుతాయి.
వేసవిలో మల్లెపూల పరిమళం మనసుకు చాలా ఉపశమనం కల్గిస్తుంది.
కీళ్ళనొప్పులు, చర్మ రోగాల నివారణలోను ఉపయోగపడుతుంది. మల్లెల నుండి తీసిన నూనె తలనొప్పికి మంచి నివారణా మార్గం.
మల్లెపూల ఆకులు డికాషన్ చేసుకుని తాగితే నులిపురుగులు చనిపోతాయ్......


ఇన్ని సుగుణాల మల్లె....నిజంగానే......సిరిమల్లె...పువ్వే................

Saturday 30 April 2011

ప్రియతమా నీవెక్కడ...? ...... పార్ట్ - 4.... కార్తీక్ ని ఐ.ఎ.ఎస్. ట్రైనింగ్ కి రావలసింది గా కాల్ లెటర్ వచ్చింది..


           కార్తీక్ ని ఐ.ఎ.ఎస్. ట్రైనింగ్ కి రావలసింది గా కాల్ లెటర్ వచ్చింది..
కార్తీక్ ని అభినందించడానికి మాధవి, చందన ఇద్దరు వచ్చారు. "కంగ్రాట్స్ అన్నయ్యా! పార్టీ ఎప్పుడు" అడిగింది చందన.

          మీరెప్పుడంటే అప్పుడే.... చెప్పాడు కార్తీక్.  "కంగ్రాట్స్ అండి" ఎంతో అభిమానంతో చెప్పింది మాధవి.
తనే ఐ.ఎ.ఎస్. పాస్ అయినంత సంతోషంగా ఉందామెకు. అలా కాసేపు మాట్లాడుకున్నారు. 
మాట్లాడుకున్నంతసేపు ఒకరి వైపు ఒకరు ఎంతో ఆర్తిగా చూసుకుంటున్నారు.
కార్తీక్, మాధవి లు ఇద్దరూ ఒకరంటే ఒకరికి మనసులో ఉన్న  ప్రేమను  బయటపెట్టుకోలేక
తల్లడిల్లిపోతున్నారు. 

     రాత్రంతా తనతో గడిపిన హిమబిందువు సూర్యకిరణాల వేడికి కరిగి, తనను వీడలేక వేడే వేళ చిగురుటాకు పడే మనోవేదన వారిద్దరి హృదయాలను అవరించుకుని ఉంది.

          "సరే ఇంక వెళ్తా కార్తీక్ గారు" చెప్పింది మాధవి.

          సరేనండి ఒకింత బాధగా అన్నాడు కార్తీక్.

          చందన గేటు వరకు వెళ్ళి మాధవి ని సాగనంపి వచ్చి, అన్నయ్యా! నీకు, మధు కి ఒకరంటే ఒకరికి అమితమైన ఇష్టం అని నాకు తెలుసు. ఎవరికి ఎవరు చెప్పు కోవడం లేదు. తనకి నువ్వంటే చాల ఇష్టం. నీకు చెప్పలేక, ఒకవేళ చెప్తే దానికి వాళ్ళ నాన్న ఒప్పుకోకపోతే ఎలా అని నలిగిపోతోంది. నువ్వు మాధవి కి ప్రపోజ్ చెయ్యడం కంటే వాళ్ళనాన్న గారితో మాట్లాడు. తను వాళ్ళ అమ్మా, నాన్న మాటను కాదని ఏదీ చెయ్యదు అని చెప్పింది చందన.

          అదేమంచిది అనిపించింది కార్తీక్ కి కూడా.
         ఒకరోజు మాధవి వాళ్ళ ఇంటికి వచ్చాడు కార్తీక్. సమయానికి వాళ్ళ నాన్న కూడా ఇంట్లోనే ఉన్నాడు.


                                                                                                                                    ఇంకా వుంది......

ప్రేమ కూడా ఎంతో మధురంగా కనబడుతుంది.........ఇంత కర్కశంగా మనసుని చీలుస్తుందా అనిపించేటట్లు


ప్రేమ కూడా 
ఎంతో మధురంగా కనబడుతుంది.......
ఇంత కర్కశంగా 
మనసుని చీలుస్తుందా అనిపించేటట్లు......
ప్రేమ బారిన పడి... 
అది పెట్టే బాధ కు విలవిలలాడే వాళ్లకు తెలుస్తుంది....
ప్రేమ ఎంత కర్కశమైనదో.....


మంచు కూడా ఎంతో స్వచ్చంగా అమాయకంగా కనిపిస్తుంది...
కానీ మనిషినే తినేస్తుంది దానిలో చిక్కుకుంటే......
దానిపేరే ఫ్రాస్ట్‍బైట్....

Friday 29 April 2011

ప్రియతమా నీవెక్కడ...? ...... పార్ట్ - 3


చందన అలోచనలు కొన్ని సంవత్సరాల క్రితం నాటి జ్ఞాపకాలను తిరగేసాయి. 

అప్పుడు మాధవి, చందనలు ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్.  కార్తీక్ ఐ.ఐ.టి. లో M.Tech. పూర్తిచేసి సివిల్స్ రాస్తున్నాడు. చందనకు కార్తీక్ అన్నయ్య వరుస అవుతాడు. 

         మాధవి పట్టు పరికిణీలో పదహారణాల స్వచ్ఛమైన తెలుగింటి అమ్మాయి లా ఉండేది.  అందం, తెలివి, అణకువ,  పెద్దలంటే వినయ విధేయతలు కలబోసిన మధ్యతరగతి అమ్మాయి.

          కానీ కార్తీక్ కొన్ని వందల కోట్ల సంపదకు వారసుడు. మృదుస్వభావి. చక్కగా ఉంటాడు. కానీ అతనిలో తాను ధనవంతుడు అన్న భావన ఎక్కడా కనబడదు. సేవాభావం ఎక్కువ.  వీలైనంత ఎక్కువ మంది సేవ చెయ్యాలనే ఉద్దేశ్యం అతనిది. ఒక ఆఫీసర్ గా ఎక్కువమంది సేవ చెయ్యవచ్చుననే  అలోచనతోనే అతను సివిల్స్ రాస్తున్నాడు. ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూడడు.

          ఐ.ఐ.టి. లో చేరిన కొత్తలో చందన పుట్టినరోజు పార్టీలో మాధవిని చూశాడు.
చూడగానే తనని తాను మర్చిపోయాడు. "ఈ అమ్మాయి తన భార్య అయితే తనంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండడు అనిపించింది. మాధవి కు కూడా కార్తీక్ ని చూడగానే గుండె ఝల్లుమంది. చూడగానే అతని పట్ల అభిమానం ఏర్పడింది. ఒకరినొకరు మౌనంగా అభిమానంగా చూసుకునేవారు. ఒకరిపై మరొకరికి అంతులేని ప్రేమ ఏర్పడింది.
కానీ ఎవ్వరూ బయటపడలేదు.  

          అలా నెలలు, సంవత్సరాలు గడిచాయి. మాధవి ఇంజనీరింగ్ పూర్తికావచ్చింది.
కార్తీకి సివిల్స్ లో దేశం మొత్తానికి టాపర్ గా నిలిచి అత్యున్నత సర్వీస్ ఐ.ఎ.ఎస్. కి సెలెక్ట్ అయ్యాడు. 

                                                                                                   ఇంకా వుంది......

దుఃఖం.... భయం..... ఘర్షణ.... వీటన్నింటిని మించిన భయంకరమైన స్థితి.....


మనసును కష్టపెట్టే విషయం ఏదైనా జరిగితే, 
మనసుకి బాధ కలుగుతుంది. మనకి ఇష్టంలేని
విషయం ఏదైనా చెయ్యాల్సి వస్తే మనసులో ఘర్షణ కలుగుతుంది. 
భరించలేనంత దుఃఖం కలుగుతుంది. మనసూ దుఃఖిస్తుంది.

ఆనందం ... దుఃఖం.... భయం..... ఘర్షణ....
ఇవన్నీ మనసుకు సంబంధించిన రకరకాల స్థాయీ భావాలు.  

కానీ... వీటన్నింటిని మించిన భయంకరమైన స్థితి.....మరొకటి ఉన్నది......

అదే....... మనసులో నిశ్శబ్దం నిద్రపోవడం......మనసులో శూన్యం ఏర్పడడం.

ఏమీ తోచదు. బాధ వేస్తుంది. కానీ ఎందుకు బాధ పడుతున్నామో తెలియదు.
కోపంగా, విసుగ్గా, చిరాగ్గా మాత్రం ఉంటుంది.
ఎందుకు విసుక్కుంటున్నామో, ఎందుకు చిరాకు పడుతున్నామో, ఎందుకు కోప్పడుతున్నామో కూడా తెలియదు. మన సొంతవారి మీదనే కేకలేస్తుంటాము.  

పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ప్రియుడితో లేచిపోయి .....

బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ పై నా అభిప్రాయం


బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ లో సుమలత తనకన్నా వయసులో పెద్దవారితో పాదనమస్కారం చేయించుకోవడం బాలేదు.  కుటుంబ సమస్యలతో బాధ పడే వారు చాలా మంది ఉన్నారు.  అత్తింట్లో ఆరళ్ళకు, భర్త పెట్టే బాధలకు తట్టుకోలేక నరకయాతన పడేవారు చాలామంది ఉన్నారు. అసలు నూటికి 90  శాతం మహిళలకు D.V. Act (Domestic Violence Act   గురించి కానీ,  498A section  గురించి కానీ తెలియదు. అటువంటి వారికి Law గురించి, Law లో మహిళలకు ఉన్న హక్కుల గురించి కొంత తెలియజేసే ప్రయత్నం అభినందించదగ్గదే.  సైకాలజిస్ట్, లాయర్, లాంటి నిపుణులతో కౌన్సిలింగ్ చేయించి పరిష్కారం సూచించటం కూడా బాగుంది.


 సంపన్నులను, మధ్యతరగతి వారిని వదిలేసి కేవలం  బీదవారిని మాత్రమే ఈ ప్రోగ్రామ్ కి పిలుస్తున్నారేమో అనిపించినా ఈ మధ్య వచ్చిన కొన్ని ఎపిసోడ్స్ లో మధ్య తరగతి వారు కూడా ఉన్నారు.  సంపన్నులకు, కోట్ల కొలది డబ్బు ఉన్నవాళ్ళలో చాలామంది మన సంస్కృతి పై పెద్దగా పట్టింపులేదు.  న్యాయాన్నే కొనగలిగేంత స్తితిలో ఉన్నవాళ్ళకు ఈ ప్రోగ్రామ్ కి రావాల్సిన అవసరం లేదు. 


 ఎటొచ్చీ మధ్యతరగతి వారికి, పేదవారికి న్యాయసహాయం అవసరం. కానీ కొన్ని సన్నివేశాలను ఎడిట్ చెయ్యాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా వాళ్ళు చానల్ లో చూపించే సమస్యల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించాలి. పెళ్ళై ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత ప్రియుడితో లేచిపోయి  ఒక నెల గడిపి మళ్ళీ తిరిగి భర్త దగ్గరకు వచ్చి నాపిల్లలు నా భర్త కావాలి అని వచ్చిన భార్య..... ఇలాంటి సమస్యలతో వచ్చేవారికి కౌన్సిలింగ్ చేసి అలాంటి వాటిని ప్రసారం చెయ్యకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం.

Thursday 28 April 2011

నోరు జారి అవతలి వాళ్ళు ఒక మాటంటే..........


నోరు జారి అవతలి వాళ్ళు ఒక మాటంటే
దాన్ని పట్టుకుని వాదించి గెలవడం,
అవతలి వారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవడం...
గొప్ప వాళ్ళ లక్షణం అయితే కావచ్చు....


కానీ...


అవతలి వాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు
 ప్రవర్తించడం మహోన్నతుల స్వభావం.

బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ పై మీ కామెంట్...ప్లీజ్...


నేను సాధారణంగా టి.వి. లొ ఎటువంటి సీరియల్ చూడను. కానీ ఈ మధ్య మా ఆవిడ బలవంతం మీద  బ్రతుకు జట్కా బండి..... ప్రోగ్రామ్ చూస్తున్నాను. చాలా మంచి ప్రోగ్రామ్ అనిపించింది.  ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిన ప్రోగ్రామ్ అనిపించింది.  ప్రతి ఇంట్లోను, ప్రతి భార్యా భర్తల మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు సహజం.  సర్దుకుపోతేనే సంసారం బాగుటుంది.  భార్య, భర్త ఇద్దరు పట్టింపులకు, పంతాలకు పోతే వారి మధ్య దూరం పెరగడమే కాకుండా అది ఇంకా చాలా దూరం వెళ్తుంది.

గొడవలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.  జీవితంలో ఒక్కోసారి రాజీ పడడం అనేది తప్పనిసరి. మరీ జీవితమే రాజీ అంటే కష్టమే.  చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న సమస్యలు ఎలా పెద్దవై ఎంత దూరం వెళ్తున్నాయో, ఎంతమంది జీవితాలు నాశనమవుతున్నాయో మన కళ్ళెదురుగా ఆ ప్రోగ్రామ్ లో చూపెడుతున్నారు.  ఒక సైకాలజిస్ట్ ని, ఒక లాయర్ ని కూర్చోబెట్టి అందరికి అర్దమయ్యేలా వివరిస్తున్నారు.  చాలామంది జీవితాలు ఈ ప్రోగ్రామ్ వల్ల బాగుపడుతున్నాయి.
సుమలత గారిది చాలా మంచి ప్రయత్నం.  ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్ చూడండి. అందరికి చూడమని చెప్పండి.
దీనివల్ల కొంతమేలు జరిగినా మంచిదే కదా. నా అభిప్రాయం చెప్పాను. మీ అభిప్రాయం చెప్పండి.

జి తెలుగు  వారి ప్రయత్నానికి హ్యాట్సాఫ్.......

Wednesday 27 April 2011

నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా.......



నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా.......


ఎవరితోనూ మాట్లాడబుద్ది కాదు.
పగలూ, రాత్రిళ్ళూ.... అలా.. నిశ్శబ్దంగా ...
వెలుగు చీకట్లలోకి ఒంటరిగా స్తబ్దంగా చూస్తూ
ఉండిపోవాలనిపిస్తుంది.


ఎందుకంటే....


ఆ నిశ్శబ్దంలో నాకు నీ శబ్దం వినబడుతుంది.
మనసును రాగరంజితం చేస్తుంది.
మనసులోని బాధంతా ఎవరో చేత్తో తీసేసినట్టు
దూదిపింజలా ఎగిరి తేలికైపోతుంది.


నీలిమేఘం తడిని వదుల్చుకోవాలంటే....
చల్లగాలి తెమ్మెరను సాయమడగాలి..
మనసుకోరికను వదుల్చుకోవాలంటే... 
నెచ్చెలి మనసునే సాయమడగాలి....


నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా....నాకు..నేను గుర్తు రాను.


ఎందుకంటే...


నేనెపుడో...నువ్వైపోయాను కాబట్టి....

Tuesday 26 April 2011

ప్రియతమా నీవెక్కడ...? ...... పార్ట్ - 2. ఇది నేను రాసిన తొలి రచన...చదివి చెప్పండి....


రెండవ భాగం......


రెండడుగులు వేసే సరికి కార్తీక్ క్రింద పడిపోయాడు.  అతన్ని జాగ్రత్తగా పట్టుకుని, అందంగా పెంచబడి ఉన్న పూలమొక్కల మధ్య ఉన్న ఒక పాలరాతి మందిరం దగ్గరకు అతన్ని తీసుకెళ్ళారు. దాని మధ్య లో పాలరాతి తో నిర్మించబడిన ఒక సమాధి ఉంది. దానిని చూడగానే చందన కళ్ళు జలపాతాలయ్యాయి.
కార్తీక్ నెమ్మదిగా ఆ సమాధి దగ్గరకు వెళ్ళి ఆప్యాయంగా దానిని తడిమి "ఇక మీరు వెళ్ళండి" ఆన్నట్టు సైగ చేసి ఆ సమాధి మీద తల పెట్టుకుని కూర్చున్నాడు.

"ఇంటికి రా కార్తీక్" దీనంగా అడిగింది చందన.
అతను రానన్నట్టు తల ఊపి వెళ్ళిపోమన్నాడు.

ఇక చేసేదేమీ లేక అక్కడే ఉండి ఆ పూలమొక్కలను, సమాధి ని జాగ్రత్తగా చూసుకునే కాపరికి డబ్బిచ్చి, అవసరమైతే వెంటనే ఫోన్ చెయ్యమని ఫోన్ నంబర్ ఇచ్చి, కార్తీక్ ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇద్దరూ అక్కడ్నించి వచ్చేశారు.

కుమార్ కు అంతా పజిల్ గా ఉంది. అసలేమీ అర్దం కావడం లేదు.

చందన ఏమీ మాట్లాడలేదు.

కుమార్ రెట్టించి అడిగాడు.  చందనా అతనెవరు? అసలేమిటిదంతా?

వారిద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది.

కాసేపటికి మెల్లగా గొంతి విప్పింది చందన.

మాధవి కాన్సర్ ట్రస్ట్ ని నెలకొల్పింది అతనే మెల్లగా చెప్పింది.

తలమీద పిడుగు పడ్డట్టు అదిరిపోయాడు కుమార్.

ప్రతి సంవత్సరం కొన్ని వందల కోట్ల రూపాయలను కాన్సర్ బాధితులకు అందజేసే కార్తీక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఒకటైన మాధవి కాన్సర్ ట్రస్ట్ ను స్థాపించింది అతనే అంటే నమ్మలేకపోతున్నాడు.

చందనతో అదే అన్నాడు.

అంతే కాదండీ! కార్తీక్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి అధినేతే అతను.

అతనే కార్తీక్.  చెప్పింది చందన.

ఒక నమ్మలేని నిజాన్ని వింటున్నట్టుగా ఉందతనికి.  దానితో పాటే ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆత్రుత నిమిష నిమిషానికి అధికమవసాగింది.


ఇంకా వుంది......

నిజమా?....కాదా?..... ఏమో మరి మీరే చెప్పండి.


1)         If you come early, the bus is late. If you come late…… the bus is still late.
2)         Whenever I find the key to success, someone changes the lock.
3)         The road to success.. is always under construction.
4)         In order to get a Loan, you first need to prove that you don't need it.
5)         Anything dropped on the floor will roll over to the most inaccessible corner.
6)         If you have paper, you don't have a pen……. If you have a pen, you don't have         paper…… if you have  both, no one calls.
7)         Irrespective of the direction of the wind, the smoke from the cigarette will always tend to      go to the non-smoker
8)         Since Light travels faster than Sound, people appear brighter before you hear them speak

Saturday 23 April 2011

ఒక ఇంజనీరింగ్ విద్యార్ధి జ్వరంతో హాస్పిటల్ కి వెళ్తే అతని రెండు కిడ్నీ లు తీసేశారు.


రాహుల్ అనే కర్షక్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్ధి జ్వరంతో హాస్పిటల్  29.10.2006 తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని ఒక పేరు మోసిన హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు.  డాక్టర్లు కండిషన్ సీరియస్ అని చెప్పి అతన్ని  I.C.U.   లో ఉంచి మొత్తం అన్ని వైపులా మూసేశారు. లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు.


రాత్రి 9 గంటల ప్రాంతంలో రాహుల్ తన తండ్రిని పిలిచి, "డాక్టర్లు తన కిడ్నీలు తీసేయడం గురించి మాట్లాడుకుంటున్నారు" అని చెప్పాడు. కానీ పల్లెటూళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళ నాన్న అది నమ్మలేదు. కొడుకు భయపడి అలా చెప్తున్నాడు అనుకుని పెద్దగా పట్టించుకోలేదు.


కానీ ఆ రాత్రే ఆ అబ్బాయి రెండు కిడ్నీలు తీసేసి అతన్ని చంపేశారు.


మరుసటి రోజు ఉదయం విషయం తెలుసుకున్న విద్యార్దులు చాలా తీవ్రంగా స్పందించారు.  వారిని లోపలికి వెళ్ళకుండా పోలీసులు అడ్డుకునేసరికి ప్రెస్ ని టి.వి. చానల్స్ వారిని పిలిపించేసరికి, అప్పుడు ఆ విద్యార్దులను లోపలికి పోనిచ్చారు.


వాళ్ళు వెళ్ళి చూసేసరికి ఆ అబ్బాయి కిడ్నీలు ఉండాల్సిన చోట కుట్లు వేసి ఉన్నాయి. రెండు కిడ్నీలు తీసేసినట్టు అందరికి అర్దమైంది.


కానీ ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ అబ్బాయి బంధువు ఒకడికి డబ్బు ఆశ చూపించి అతన్ని లొంగతీసుకున్నారు.  దురాశాపరుడైన అతను వారికి దాసోహమైపోయి ఆధారాలేవీ లేకుండా ఆ అబ్బాయి శవాన్ని తీసుకెళ్ళి కాల్చేశాడు.  ఆ అబ్బాయి కుటుంబం మొత్తం షాక్ లో ఉండడం వల్ల వారు ఏమీ చెయ్యలేకపోయారు.


కొందరు దుర్మార్గుల వల్ల ఒక నిండుప్రాణం పోయింది.


మిత్రులారా, ఈ విషయాన్ని మీకు తెలిసిన వాళ్లకు అందరికి చెప్పండి.  ఈ విధంగా మరో ప్రాణం పోకుండా కాపాడండి.


ఇది కూడా నిజంగా జరిగిన విషయమే. దీని లింక్ కింద ఇస్తున్నాను చదవండి.






మామిడి పండ్లు కొనే ముందు తస్మాత్ జాగ్రత్త.....

వ్యాపారస్తులు లాభాల కోసం మామిడి పండ్లను కృత్రిమంగా పండించడానికి గాను, మామిడి పండ్ల మీద కార్బైడ్ అనే ఒక కెమికల్ చల్లి వాటిని కృత్రిమంగా  రంగు తెప్పిస్తున్నారు.  ఇలా కార్బైడ్ తో పండిన మామిడి పండ్లు తినడం వల్ల చాలా మంది రోగాల బారిన పడుతున్నారు.  ఈ కార్బైడ్  తో పండిన మామిడి పండ్లు తినడం వల్ల కడుపు నొప్పి, అతిసారం, వాంతులు, కడుపులో వికారంగా ఉండడం మొదలైన రోగాల బారిన పడాల్సి వస్తుంది.  


కొంచెం జాగ్రత్తగా కొనడం మంచిది.  కొంచెం పచ్చిగా ఉన్న కాయల్ని తీసుకుని మనమే బియ్యం డబ్బాలోనో లేకపోతే మరేదాంట్లోనో ఉంచి పండించుకోవడం మంచిది.


ఆపిల్ పండ్లు మరి కొన్ని పండ్లు మెరవడానికి వాటి మీద మైనం వేస్తున్నారట.  అలాగే పుచ్చకాయలు తియ్యగా ఉండడానికి "సచ్చారిన్" అనే కెమికల్ కలుపుతున్నారట. .... 


కాబట్టి, మిత్రులారా ఇంతకీ నే చెప్పొచ్చేదేమిటంటే....... ఏమీ లేదు.... నాకు తెలిసిందంతా చెప్పేసాను.  మన కుటుంబాల గురించి మనమే శ్రద్ద తీసుకోవాలి కాబట్టి....... కొనేముందు మంచివి చూసి కొనండి....

ఒక చిట్టి పాప ప్రాణాన్ని బలి తీసుకున్న సెల్ ఫోన్....


ఇది నేను ఎక్కడో చదివానండి.  అందరికి చెప్పడం మంచిది అనిపించింది. అందుకే అందరితో పంచుకుంటున్నాను.


ఒక హాస్పిటల్ లో ఒక చిన్నారి పాపకు ఏదో ఆపరేషన్ జరుగుతోంది. ఒక యంత్రం ద్వారా ఆపరేషన్ జరుగుతోంది. డాక్టర్స్ అందరు చాలా అప్రమత్తంగా ఉద్విగ్నంగా ఉన్నారు.  అది చాలా క్రిటికల్ కేస్.  ఆపరేషన్ కీలకమైన దశకు చేరుకుంది.  ఉన్నట్లుండి ఆ యంత్రం బీప్ బీప్ అని ఎవరో ఆపినట్టు గా ఆగిపోయింది.  ఆ డాక్టర్స్ కి ఒక్క క్షణం ఏమీ అర్దం కాలేదు.  అంతలోనే తేరుకుని, ఎవరో ఆపరేషన్ చేస్తున్న గది బయట సెల్ ఫోన్ మాట్లాడుతున్నట్టు గుర్తించి, బయటకు పరుగెత్తి ఆ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించి, మళ్ళీ ఆపరేషన్ థియేటర్ లోకి వచ్చేసరికే ఆ పాప ప్రాణం పోయింది.  ఆపరేషన్ థియేటర్ బయట సెల్ ఫోన్ వాడడం వల్ల దాని నుంచి వచ్చిన రేడియేషన్ ప్రభావం వల్ల ఆ యంత్రం పనిచేయడం ఆగిపోయింది.  కేవలం దాని వల్ల ఒక చిన్నారి ప్రాణం పోయింది.

మిత్రులారా, హాస్పిటల్స్ లో గాని, పెట్రోల్ బంక్ ల దగ్గర కాని, విమానంలో కాని.... దయచేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి.  ఎవరైనా మాట్లాడుతున్నా కూడా, వారికి నచ్చచెప్పి వారి సెల్ ఫోన్ కూడా ఆఫ్ చేయించండి. రేడియేషన్ బారి నుండి మనల్ని మనమే కాపాడుకోవాలి. దయచేసి అందరు సహకరించండి.

Thursday 21 April 2011

ప్రియతమా నీవెక్కడ...? ...... పార్ట్ - 1


ప్రియతమా నీవెక్కడ...?...... పార్ట్ 1

                        "ప్రేమ...."

              ఈ రెండక్షరాలే రెండు హృదయాల కలయికతో ముడిపడిన రెండు జీవితాలు కడదాకా సాగించే ప్రయాణానికి ఆధారం.
               ప్రతి స్త్రీ తనకు కాబోయే భర్త తనకు మంచిస్నేహితుడవ్వాలని కోరుకుంటుంది.  అలాగే, ప్రతి యువకుడు కూడా తనకు కాబోయే అమ్మాయి గురించి ఒక నిర్దిష్టమైన అభిప్రాయాన్ని కలిగిఉంటాడు.  భార్య మనసును అర్ధం చేసుకోలేని మగవాడు మంచిభర్త కాలేడు.  పురుషుడి హృదయం స్త్రీలా మెత్తనైనది.  స్త్రీ హృదయం పురుషుడిలా కఠినమైనది అని ఓ మహానుభావుడు చెప్పాడు...."
               అతని ప్రసంగం ఇంకా కొనసాగుతూనే ఉంది.
               "పదండి వెళ్లిపోదాం" అంది చందన.
               స్పీచ్ బానే ఉంది గా.  అప్పుడే వెళ్ళిపోదామంటున్నావేం.  మీ అమ్మాయిల మనసులు కఠినంగా ఉంటాయి అనేసరికి కోపం వచ్చిందా... నవ్వుతూ అడిగాడు కుమార్.
               అదేం లేదండీ అంది చందన.
               వాళ్ళిద్దరు భార్యాభర్తలు.  కుమార్ సాఫ్ట్‍వేర్ ఇంజనీర్.  చందన "మాధవి కాన్సర్ ట్రస్ట్" కి ఛైర్మన్.
               ఆ చర్చ జరిగుతున్న ఆడిటోరియం నుండి బయటికి వచ్చి ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ పార్క్ వైపు నడిచారు.
               చందనా! అటు చూడు.  జైలు నుండి పారిపోయి వచ్చినట్లున్నాడు కదూ.  బహుశా టెర్రరిస్టేమో నవ్వుతూ అన్నాడు కుమార్.  భర్త మాటలకు యధాలాపంగా అటుకేసి చూసింది చందన.  మాసిన బట్టలు, తైలసంస్కారం లేక రేగిన జుట్టు, అసహ్యంగా కనిపిస్తున్న గడ్డంతో భయంకరంగా ఉన్నాడతను. అతన్ని చూసి ఒక్క క్షణం షాక్ కి గురై వెంటనే తేరుకుని, "కార్తీక్" అని గట్టిగా కేక పెట్టి అతని వైపు పరిగెత్తింది.
               కుమార్ కి ఏమీ అర్దం కాలేదు.  అయోమయం గా ఆమెని అనుసరించాడు "ఏమైంది చందూ,  ఏమైంది అంటూ"
               కార్తీక్ ఎలా ఉన్నావు.  ఎక్కడ ఉన్నావు. అసలు ఇన్ని రోజులు ఏమై పోయావు.. ఉబుకుతున్న కన్నీటిని అదుపుచేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ  ఒక రకమైన ఉద్వేగంతో అడిగింది చందన.
               విస్మయంగా వారిద్దరికేసే చూస్తున్నాడు కుమార్.
               భావరహితంగా ఆమె వైపు చూసి నిర్లిప్తంగా నవ్వాడతను.  కళ్ళు రెండూ లోపలికి పీక్కుపోయి నేడో రేపో పోయేలా ఉన్నాడతను.

              నన్ను "మధు" దగ్గరకు ఒకసారి తీసుకెళ్ళవా..? నెమ్మదిగా గొంతు పెగిల్చాడు కార్తీక్.
               మధు దగ్గరికా..? ఆమె కంఠం రుద్దమైంది.
              ప్లీజ్.. ఇదే చివరిసారి.  నన్ను తీసుకెళ్ళు.  అతని కంఠంలో ఆజ్ఞ లాంటి అభ్యర్దన ఉంది.
               ఆమె కళ్ళల్లోంచి కన్నీరు ధారలు గా కారుతుండగా,  గత్యంతరం లేక కుమార్ దగ్గరికొచ్చి "ఏమండీ మన కారు ఇక్కడికి తీసుకురండి" అని చెప్పింది.
               అదికాదు చందనా, అతనెవరో ఏమో, నువ్విలా... అతనింకా ఏదో చెప్పబోతూంటే వారించి, ప్లీజ్ అండీ మీకు అంతా తర్వాత వివరంగా చెబుతాను.  ముందు కారు తీసుకురండి అంది.
               అన్యమస్కంగానే కారు తీసుకు వచ్చాడు.  కార్తీక్ ని జాగ్రత్తగా కారు బాక్ సీట్ లో పడుకోబెట్టారు. 
               డ్రైవింగ్ సీట్ లో కూర్చుని చందనే డ్రైవింగ్ చెయ్యసాగింది. 
              "ఎక్కడికెళ్తున్నాం చందూ" అడిగాడు కుమార్.
               ఆమె ఏదో దీర్ఝాలోచనలో ఉంది.  కారు "హిందూ స్మశాన వాటిక" లోకి ప్రవేశించింది. 
               ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చావు అడిగాడు కుమార్ ఒకింత అసహనంతో.
               చెమర్చిన కళ్ళతో "మాధవి ఉండేది ఇక్కడే " చెప్పింది చందన.  నిశ్చేష్టుడైపోయాడు కుమార్.

                                                                                                        (ఇంకా ఉంది).....




రెండు భారత్‌లు ఉండరాదు !


దేశంలో ఆకలి చావులు సంభవిస్తుండటంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బుధవారం ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది. 'మీకు రెండు భారత్‌లు ఉండబోవు. పౌష్టికాహార లోపం నిర్మూలనకు సంబంధించి మన మొత్తం వైఖరిలో ఈ మొరటు వైరుధ్యాలేమిటి? దేశంలో పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా అంతం చేయాలి' అని దల్వీర్‌ భండారీ, దీపక్‌ వర్మతో కూడిన అత్యున్నత ధర్మాసనం అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మోహన్‌ పరాశరన్‌కు సూచించింది. 'ఓవైపు సంపన్నులు, మరోవైపు ఆకలి చావులు' ఒకే దేశంలో ఈ అంతరాలు ఏంటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 'మన దేశం సంపన్నంగా మారుతోందని మీరే అంటున్నారు. అదే సమయంలో దేశంలో ఆకలి చావులూ సంభవిస్తున్నాయి. ఏమిటీ వైరుధ్యం?' అని ప్రశ్నించింది. దేశంలో మిగులు ఆహార ధాన్యాలున్నాయని చెబుతున్న సమయంలోనే ఆకలి చావులూ సంభవిస్తుండటంపై వ్యాఖ్యానిస్తూ 'ధనిక - పేద అని దేశాన్ని రెండుగా విభజించేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. పేదరికాన్ని నిర్ణయించేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న అర్హతా ప్రమాణాలను న్యాయమూర్తులు తప్పుబట్టారు. 'దేశంలో పంటలు బాగా పండాయని, గోదాములు పూర్తి నిల్వలతో వున్నాయని వింటున్నాం. ఇది సంతోషకరమైన పరిస్థితి అనడంలో సందేహం లేదు. అయితే ప్రజలకు ప్రయోజనం కలిగించని ఈ అంశాలతో ఉపయోగం ఏమిటి? ఓ వైపు గోదాములు సమృద్ధిగా ఉండగా, మరోవైపు ప్రజలు ఆకలితో మాడుతు న్నారు' అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. ప్రణాళికా సంఘాన్ని ఉద్ధేశించి 'పోషకాహార లోపం క్రమంగా పెరుగుతోంది. మీరేమో దేశంలో 36 శాతం మంది మాత్రమే పేదరిక రేఖకు దిగువన వున్నారంటున్నారు. 2011లో కూడా మీరు 1991 నాటి లెక్కలనే అనుసరిస్తున్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలే ప్రణాళికా సంఘం లెక్కలతో విభేదిస్తూ అఫిడవిట్లు సమర్పిస్తున్నాయి. పేదలు ఎక్కువగా వున్నారని, తాము ప్రణాళికా సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తున్నామని రాష్ట్రాలు చెబుతున్నాయి. పేదరి కాన్ని నిర్ధారించేందుకు పట్టణ ప్రాంతాల్లో రోజుకు రు.20, గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రు.11ల ఆదాయాన్ని మీరు నిర్ణయించారు. ఈ నామమాత్రపు ఆదాయ నిర్ణయాన్ని మీరు ఏ విధంగా సమర్ధించుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోజు జీవనానికి ఇది సరిపోదే..!? దీనిపై ప్రణాళికా సంఘం వివరణ ఇవ్వాలి' అని కోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది.
దారిద్య్ర రేఖకు దిగువన (బిపిఎల్‌) ఉన్న కుటుంబాల అర్హతను నిర్ణయించే విషయంలో కేంద్రం, ప్రణాళికా సంఘాలను సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించింది. ఈ అర్హతను నిర్ణయించడంలో వున్న వైరుధ్యాలపై వారంలోగా తనకు అఫిడవిట్‌ సమర్పించాలని ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌ను సుప్రీం ఆదేశించింది.

నవ్వుల జల్లు


అదేంటిరా...?
రవి: అరే సురేష్‌! 'ఐయామ్‌ గోయింగ్‌' అంటే అర్థం చెప్పరా?
సురేష్‌: 'నే వెళుతున్నా!'
రవి: అదేంటిరా? ఒక్క ఇంగ్లీషు వాక్యానికి అర్థం చెప్పమని అడిగితే నే వెళుతున్నా అంటావేంటిరా? ఎంత నీకు ఇంగ్లీషు వస్తే మాత్రం మరీ అంత ఇది పనికిరాదురా? నాలాంటి తెలియనవాళ్లకు చెప్పాలి కదరా?
సురేష్‌: ఆఁ.......!

దీపం కదా.!
సుబ్బారావు: ఏంటిరా? కరెంటు పోయినా చీకట్లోనే ఉన్నారు. దీపమన్నా వెలిగించుకోకుండా?
రామారావు: మా ఆవిడ చదువుకుంటోందిరా!
సుబ్బారావు : అయితే తప్పకుండా వెలిగించాలిగా మరి..?!
రామారావు: ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు కదరా!
సుబ్బారావు : ఆఁ.......!

రేపే ధరిత్రి దినోత్సవం... మన భూమాతను రక్షించుకుందాం.

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్‌ 22న 'ధరిత్రి దినోత్సవం' జరుపుకుంటు న్నారు. భూమి.. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజల్లో అవగాహన కలిగించడమే దీని ముఖ్యోద్దేశం. మొదట ఐరాస 1969, మార్చిలో జాన్‌మెక్కల్‌తో ప్రారంభించింది. ఆ తర్వాత అమెరికా రాజకీయవేత్త గేలార్డ్‌నెల్సన్‌ ప్రారంభిం చారు. 1962లో సెనెటర్‌ నెల్సన్‌కి వచ్చిన ఆలోచనకు ప్రతిరూపమిది. ఆ తర్వాత 1970 ఏప్రిల్‌ 22న అమె రికా తమ దేశంలో మొదటిసారి జరుపుకుంది. ఇక అప్పటి నుండి ఆ తేదీ ఖరారైంది. ఏదేమైనా నేడు భూమికి, పర్యా వరణానికి ముప్పు ముంచుకొచ్చింది. రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ నేపథ్యంలో అన్నిదేశాలు చిత్తశుద్ధితో ముం దుకురావాలి. అప్పుడే అందరికీ నిజమైన 'ధరిత్రి దినోత్సవం'.

Wednesday 20 April 2011

ఇంద్రవెల్లి గాయానికి మూడు దశాబ్దాలు


ఇంద్రవెల్లి గాయానికి మూడు దశాబ్దాలు

  • అడవి బిడ్డల గుండెల్లో చెరగని ముద్ర
  • అభివృద్ధికి ఆమడదూరంలో ఆదివాసీిలు
  • మారని జీవన ప్రమాణాలు
  • నేడు ఇంద్రవెల్లి మృతవీరుల సంస్మరణ దినం
ఇంద్రవెల్లిలో అడవి బిడ్డలు రక్తం చిందించి మూడు దశాబ్దాలయ్యాయి. 1981 ఏప్రిల్‌ 20న తుడుంమోతకు తరలివచ్చిన ఆదివాసులపై పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకీ తూటాలకు అడవి బిడ్డలు అమరులై ఈనెల 20వతేదీ బుధవారం నాటికి 30 ఏళ్లు గడిచాయి. అడవి బిడ్డలు చిందించిన రక్తం తడి ఇంకా ఆరనేలేదు. ఇంద్రవెల్లి పోరు అడవి బిడ్డల్లో పోరాటతత్వాన్ని పెంచింది. గతంలోకి ఒక్కసారి తొంగిచూస్తే ముప్ఫై ఏళ్ల క్రితం ఆదివాసులు బుక్కెడు బువ్వ కోసం పడరాని కష్టాలు పడుతున్న రోజులు.. రెండు కాళ్ల ఆధునిక మృగాల తాకిడికి అడవి అడవంతా అల్లాడింది.. 

దళారులు.. వ్యాపారులు, అటవీ అధికారులు, పోలీసుల చేతిలో ఆదివాసుల బతుకులు దోపిడీ, పీడనకు గురయ్యాయి. అడవిలో ఆకుల దోపిడి.. అడవి సంపద దోపిడి.. ఆఖరికి అడవిలో వీచే గాలి సైతం దోపిడీనే.. అడవి బిడ్డలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. చిట్టడవులు చీకట్లో చిక్కి శల్యమయ్యాయి. అడవి ఒడిలో అభివృద్ధి అనేది కనుచూపులో కనబడలేదు. అక్కడంతా చీకటి. దళారుల దోపిడీ.. అక్కడ అమాయకులను బాదుతున్న పోలీసు లాఠీలు.. గిరిజనులు నోరు విప్పితే చాలు చావబాదే రోజులు.. అడవి బిడ్డలు ఆత్మరక్షణ కోసం నడుం బిగించక తప్పని పరిస్థితి. ఆ తరుణంలోనే అటవీ గ్రామాల్లో అన్నలు రంగ ప్రవేశం చేశారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను చూసి ఎదిరించారు. గిరిజనుల గుండెల్లో చోటుసంపాదించారు. గూడాల్లో స్థానం పొందారు.
ఫలితంగా గిరిజన గ్రామాల్లో బూట్ల చప్పుడు ప్రారంభమైంది. పోలీసుల అరాచకత్వాలకు బలవుతున్న గిరిజనులను అన్నలు తట్టిలేపారు. చైతన్యాన్ని రగిల్చారు. అడవి బిడ్డలు అన్నలతో జతకట్టారు. వారితో కలిసి తుడుం మోగించారు. అన్యాయాన్ని ఎదురించారు. తమకు జరుగుతున్న అన్యాయాలు పట్టిపీడిస్తున్న భూమి సమస్యను పరిష్కరించడం కోసం గిరిజనులు అన్నల సహాయంతో పథకాన్ని రూపొందించుకున్నారు. అన్నల అండతో అణగారిన జాతి అగ్గై లేచింది. అడవుల్లో ఖాళీగా ఉన్న భూములలో పోడుసాగు ప్రారంభించారు. అప్పుడే అడవుల్లో అలజడి మొదలైంది. తమ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించుకున్నారు.



నక్సల్స్‌ అనుబంధ సంస్థ రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్‌ 20న బహిరంగ సభ నిర్వహించడానికి గ్రామాల్లో తుడుం మోగించి ప్రచారం చేశారు. ఆనాడు 1981 ఏప్రిల్‌ 20న నాలుగు దిక్కుల నుంచి ఆడ, మగ, చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా ఆదివాసులు ఇంద్రవెల్లి చేరుకున్నారు. వేలాది మంది ఇంద్రవెల్లి చేరుకోవడంతో ఇంద్రవెల్లి జనసంద్రమైంది. గిరిజనులు ఇంద్రవెల్లికి రాకుండా పోలీసులు విఫలయత్నం చేశారు. జనాన్ని చూసి పోలీసు గుండెలు అదిరిపోయాయి. పోలీసుల చేతిలో తుపాకులు, గిరిజనుల చేతిలో ఆయుధాలు ''నువ్వా... నేనా'' అన్నట్లు ఉన్నాయి. ఆ రోజు ఇంద్రవెల్లి సంతకు వచ్చిన జనం మరోవైపు సభ కోసం వచ్చిన వేలాది మందితో ఇంద్రవెల్లి కిక్కిరిసిపోయింది. పోలీసులు జనాన్ని అదుపు చేయలేకపోయారు. సభాస్థలికి చేరుకోవడానికి ఊరేగింపు ప్రారంభమైంది. వేలాది మంది చేస్తున్న నినాదాలతో ఇంద్రవెల్లి దద్దరిల్లిపోయింది. అదే గుంపులో ఓ గిరిజన మహిళకు పోలీసుకీ మధ్య మాటామాటా పెరిగింది. ప్రాణం కంటే శీలం ముఖ్యమనుకున్న ఆ యువతి పోలీసుల ఆయుధ ప్రయోగం చేసింది. పోలీసు నేలకొరిగాడు. పరిస్థితి అదుపు తప్పి కాల్పులకు దారితీసింది.




ఆదిలాబాద్‌ ఆర్డీఓ కాల్పులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే పోలీసులు కాల్పులు ప్రారంభించి పిట్టలను కాల్చినట్లు ఆదివాసులను కాల్చారు. కరుడుగట్టిన మేఘాలు తీర్చలేని ధరణి మాత దాహాన్ని గోండుల రక్తం తీర్చింది. అప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు.
అనధికార లెక్కల ప్రకారం మరణించిన వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. పోలీసు కాల్పులకు కాళ్లు, చేతులు పోగొట్టుకున్న గిరిజనులెందరో నేటికి సజీవ సాక్ష్యంగా ఉన్నారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో మరణించిన గిరిజనుల స్మారకార్థం రైతుకూలీ సంఘం ఇంద్రవెల్లిలో స్థూపాన్ని ఏర్పాటు చేసింది. అయితే 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు స్థూపాన్ని డైనమైట్లతో పేల్చి నేలమట్టం చేశారు. స్థూపాన్ని కూల్చడంతో గిరిజనుల్లో నిరాశ నిస్పృహలు పెరిగాయి. అన్నలకు మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే అల్లంపల్లి సంఘటన జరిగింది. గిరిజనుల్లో నెలకొని ఉన్న నిరాశను గమనించిన అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 1987లో ప్రభుత్వ నిధులతో స్మారక స్థూపాన్ని నిర్మించారు. అడవిబిడ్డలు చిందించిన రక్తపు మరకలు ఇంకా చెదిరిపోలేదు. అడవి తల్లి ఇంకా మౌనంగా రోదిస్తూనే ఉంది. ఇంద్రవెల్లి సంఘటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గిరిజనుల సంక్షేమానికి పాలకవర్గాలు పెద్దపీట వేశాయి. ఇంద్రవెల్లి సంఘటన గిరిజనుల్లో పోరాట తత్వాన్ని మరింత బలోపేతం చేసింది. అనేక పోరాటాలకు సన్నద్ధం చేసింది.


గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రతియేటా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నా ఆశించినంత అభివృద్ధి జరగలేదు. ఆనాడు అధోగతికి ఆనవాళ్లుగా ఉన్న గిరిజన గ్రామాల్లో కొంత అభివృధ్ధి కనిపించినా జీవన ప్రమాణాల్లో మార్పులు రాలేదు. ఇప్పటికీ మారుమూల ప్రాంతాల్లో కూడు కరువై.. బతుకు బరువై అడవి బిడ్డలు అల్లాడుతూనే ఉన్నారు. తాగునీరు, వైద్యం ఇంకా వారికి అందడం లేదు. ఊరూరూ చెట్టుకొకటి.. గుట్టకొకటి రక్షిత నీటి పథకాలు నిర్మించినా గిరిజనులకు చుక్కనీరు అందడం లేదు. కలుషిత నీరు ఆదివాసుల ప్రాణాలను హరించేస్తోంది. వైద్యం అందక యేటా వందలాది మంది మరణిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలంకారప్రాయంగానే మిగిలిపోయాయి. గిరిజనుల వ్యవసాయం అటకెక్కింది. గిరిజనుల భూములకనుగుణంగా సాగునీటి వనరులు పెంపొందించడానికి నిర్మించిన చిన్ననీటి పారుదల ప్రాజెక్టులు వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. చెరువుల నిర్మాణంలో గిరిజనుల వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కంట్రాక్టర్ల ప్రయోజనాలను అధికారులు దృష్టిలో ఉంచుకొని నిర్మించడంతో చెరువుల నిండా నీరున్నా అవి చేలకందని పరిస్థితి నెలకొంది. పౌష్ఠికాహార లోపం కారణంగా రక్తహీనత ఏర్పడి జీవచ్ఛవాలుగా మారి రోగాల బారిన పడి ఆదివాసులు అడవిసాక్షిగా ప్రాణాలు విడుస్తున్నారు.
గిరిజన మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కాయకష్టం చేసే ఆదివాసి మహిళలు రక్తహీనతతో చావుకు చేరువవుతున్నారు. గిరిజనుల జీవన విధానం ఇలా ఉంటే ముప్పై ఏళ్లక్రితం గిరిజనుల్లో ఉన్న చైతన్యం ఇప్పుడు అనేకరెట్లు పేరిగింది. పోరాట మనస్తత్వం గల ఆదివాసులలో సామాజిక చైతన్యం స్పష్టంగా కనబడుతోంది. రోడ్డు సైడు గ్రామాల పరిస్థితిని చూసి గిరిజనులు అభివృద్ధి చెందారంటే పప్పులో కాలేసినట్లే. మారుమూల గ్రామాల్లో గిరిజనుల పరిస్థితి ఇంకా దయనీయంగానే ఉంది. అటవీ హక్కుల చట్టంతో అటవీ భూములు గిరిజనుల హస్తగతం కావడంతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. అటవీ భూములపై హక్కులు రావడం గిరిజనుల త్యాగఫలితమేనని ఆదివాసులు నమ్ముతున్నారు. 

గిరిజన ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు భారీగానే కృషి జరుగుతున్నప్పటికీ ఉన్నత చదువులకు ఆదివాసీ యువతీ యువకులు ఇంకా దూరంగానే ఉన్నారు. మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు నెలకొల్పడం వల్ల గిరిజన బాలబాలికలు చదువుపై ఆసక్తి కనబరుస్తుండటంతో ఇప్పుడిప్పుడే ఆదివాసీ యువతీ యువకుల్లో సామాజిక చైతన్యం పెల్లుబుకుతోంది. ఆశ్రమ పాఠశాలలు పెద్ద ఎత్తున ఏర్పాటుచేయడంతో గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తున్నారు. వైద్యారంగం ఇంతవరకు మెరుగుపడలేదు. సౌకర్యాలు మెరుగుపడినప్పటికీ గిరిజనులకు సకాలంలో మందులు దొరకడం లేదు. ఇప్పటి మారుమూల ప్రజల గ్రామాల్లో సంవత్సరాంతం వ్యాధులు అడవిబిడ్డలను వేధిస్తూనే ఉన్నాయి. గిరిజనులను అభివృద్ధి పరిచేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నా ఇంకా దోపిడీ, పీడన కొనసాగుతూనే ఉన్నాయి. అమాయక గిరిజనులు ఇంకా దోపిడీకి గురవుతూనే ఉన్నారు.


ఇంద్రవెల్లి క్షతగాత్రుల దీనగాథలు

ఇంద్రవెల్లి మారణహోమం జరిగి మూడు దశాబ్దాలు గడిచినా ఆ గాయం ఇంకా మానలేదు. ఇంద్రవెల్లి కాల్పుల్లో క్షతగాత్రులైన వారి బతుకులు నేటికీ దుర్భరంగానే ఉన్నాయి. పోలీసుల తూటాలకు బలైన వారి కుటుంబాలకు ఇప్పటికీ ఎలాంటి సహాయం అందకపోగా క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఇంద్రవెల్లి క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్రణాళికను రూపొందించినా దాన్ని అమలు చేయలేదు. అడవి బిడ్డల త్యాగాలు వృథా పోవని, వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని బాసలు చేసిన వారు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. 

ఇంద్రవెల్లి కాల్పుల్లో పోలీసు తూటాకు గాయపడ్డ కినక మాన్కుబాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆమె అవివాహితగానే మిగిలిపోయింది. ఇంద్రవెల్లి కాల్పుల్లో గాయపడ్డ భీంరావు పోలీసు తూటాలకు కాలు పోగొట్టుకుని భయకంపితుడై స్వగ్రామం విడిచిపెట్టి ఉట్నూర్‌కు సమీపంలోని వంకతుమ్మ గ్రామంలో నివసిస్తున్నాడు. మడావి జంగుబాయి, ఆమె భర్త శంభు ఇంద్రవెల్లి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సంఘటన స్థలం నుంచి తప్పించుకున్నారు.
వైద్యమందక మడావి జంగుబాయి, భర్త శంభు అనంతలోకాలకు వెళ్లిపోయిన సంఘటన ఇప్పటికీ గిరిజనుల హృదయాలను కలిచివేస్తోంది. భర్త చనిపోయిన తరువాత ఆమె బతుకుదెరువు కోసం కన్నాపూర్‌ గ్రామానికి వెళ్లిపోయింది. అడవే ఆధారంగా జీవిస్తోంది. హెర్మ దేవరావు అనే గిరిజనుడు భుజానికి తూటా తగలడంతో వైద్యమందక మరణించగా ఆయన భార్య మానుబాయి, కొడుకు లింగుతో కలిసి దేశాంతరాలు వెళ్లిపోయింది. ఏప్రిల్‌ వచ్చిందంటే క్షతగాత్రుల కుటుంబాలు, ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలు ఆనాటి సంఘటనను జ్ఞాపకం తెచ్చుకొని కన్నీరు తెచ్చుకోవడం తప్ప వారికి మరే మార్గం లేదు. ఇంద్రవెల్లి మండలంలోని ఓల్‌మద్రి గ్రామానికి చెందిన సెడ్మకి కొద్దు ఇంద్రవెల్లి కాల్పుల్లో అసువులు బాయగా ఆయన కుటుంబం దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తోంది. ఆయన కొడుకు మహంతిరావు, భార్య లక్ష్మీబాయి కోయల్‌పాండ్రి, తాటిగూడ గ్రామాల్లో నివసిస్తున్నారు.


ఇంద్రవెల్లి సంఘటనలో అమరులైన త్యాగజీవులందరికి.... నా సుమాంజలి..